
లక్ష్మణ్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు
ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్.
దిల్లీ: తెరాస పార్టీలో అనేక మంది కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని.. సమయానుగుణంగా వారు బయటకు వస్తారని భాజపా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ కట్టప్పల విషయంలో భాజపా పాత్ర లేదని, తెరాసలోని అసంతృప్తులే అందుకు కారణమని ఆరోపించారు. రాజ్యసభసభ్యునిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనను సౌత్ అవెన్యూలోని ఓ సమావేశ మందిరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్, వెదిరె శ్రీరాం తదితరులు సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ భాజపాలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరిక ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందన్నారు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మాతో సరితూగలేనని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలక జాతీయ పార్టీ పెడతానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రశాంత్ కిశోర్ కుట్రలు సఫలీకృతం కాబోవన్నారు..


