Telugu Updates
Logo
mobile after logo

మంచిర్యాలలో ప్రైవేట్ స్కూళ్ల బుక్కుల దందా..?

ఒక్క బుక్ స్టాల్‌కే పరిమితమైన పుస్తకాల విక్రయం

గంటల తరబడి క్యూల్లో తల్లిదండ్రులు.. విద్యాశాఖ జోక్యం చేసుకోవాలంటూ ఆవేదన

ఆంజనేయలు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ కొనుగోలు కోసం ఒకే బుక్ స్టాల్‌ను సూచిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ “సాయి బుక్ స్టాల్”లో మాత్రమే వివిధ ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో వందలాది మంది తల్లిదండ్రులు ఒకే దుకాణానికి చేరుకోవడంతో గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నారులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఇతర బుక్ స్టాల్స్‌లో ఆ పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో తమకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లు ఒకే దుకాణాన్ని సూచించడం వెనుక వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పుస్తకాల ధరలు, సరఫరా విధానం, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి, పుస్తకాల విక్రయాలను ఒకే దుకాణానికి పరిమితం చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను నేరుగా పాఠశాలల ద్వారానే అందించే విధానాన్ని అమలు చేయాలని లేదా జిల్లాలోని ఇతర పుస్తక దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ అంశంపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి, తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. “విద్య వ్యాపారం కాకూడదు… తల్లిదండ్రులపై అదనపు భారం పడకుండా అధికారులు జోక్యం చేసుకోవాలి” అని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

Post bottom