జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 29 ఉదయం 9 గంటలకు మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ నందు దివ్యాంగులకు ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలలోపు, 18 నుండి 54 సంవత్సరాలు వయస్సుల వారిగా వేరు వేరు క్రీడల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంధులకు రన్నింగ్, షాట్ పుట్, చెస్, మరియు బధిరులకు రన్నింగ్, షాట్ పుట్, జావెలిన్ త్రో, అలాగే శరీరక వైకల్యం గలవారికి షాట్ పుట్, జావెలిన్ త్రో, క్యారమ్స్, మరియు బుద్ధి మాంద్యం గలవారికి రన్నింగ్, షాట్ పుట్, వేరు వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆటల పోటీలో పాల్గొనాలని ఆసక్తి ఉన్న జిల్లాలోని దివ్యాంగ వాసులు సదరం సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డు తీసుకుని ఈ నెల 29వ తారీకు ఉదయం 9గంటలకు బాయ్స్ హై స్కూల్లో హాజరు కాగలరని తెలిపారు.. అనంతరం ఈ పోటీలో మొదటి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపబడతాయని ఇట్టి అవకాశాన్ని జిల్లా దివ్యాంగులు సద్వినియోగం చేసుకోగలరని అన్నారు. మరిన్ని వివరాలకు మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల శాఖ, జిల్లా కార్యాలయంను సంప్రదించాలని తెలియజేశారు.


