సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం. అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఉదయం వాకింగ్ కు వెళ్లిన ఆయన తీవ్ర గాయాలతో కుప్పకూలారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఆంజనేయులు న్యూస్, సిద్దిపేట జిల్లా: చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఉదయం వాకింగ్ కు వెళ్లిన ఆయన తీవ్ర గాయాలతో కుప్పకూలారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన చనిపోయారు. గుర్జకుంట గ్రామానికి చెందిన మల్లేశం.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాస తరపున చేర్యాల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చేర్యాల పెద్దమ్మగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఆయన.. ఆదివారం జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ ఉదయం వాకింగ్ కు వెళ్లిన తర్వాత గుర్జకుంటలోని చేర్యాల మార్గంలో కుప్పకూలి ఉండటాన్ని స్థానికులు గమనించారు. తలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉండటంతో స్థానికుల సహకారంతో కుటుంబసభ్యులు సిద్దిపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరించారు. ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారా? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఘటనపై జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరిరెడ్డి ఆరా తీశారు. మరోవైపు ఇటీవల స్థానికంగా భూతగాదాలు, రాజకీయ గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో మల్లేశంను ఎవరైనా హత్య చేశారా? అనే చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంలో ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

