
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి 6వ తెలంగాణ బాస్కెట్ బాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్ షిప్ పోటీలను జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఈ పోటీలు మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మనిషికి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ఆరోగ్యమే మహా భాగ్యమని, కరోనా సమయంలో శారీరక దృఢత్వం, రోగ నిరోధక శక్తి ఆవశ్యకత తెలిసిందని అన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం, రోగ నిరోధక శక్తి పెంపొందుతాయని, క్రీడలతో భవిష్యత్తు కూడా బాగుంటుందని, దైనందిన జీవితంలో క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు.
ఈ ఛాంపియన్ షిప్ పోటీలలో 18 జిల్లాల నుంచి 33 జట్లు పాల్గొంటున్నాయని, ఇందులో 15 బాలికల జట్లు,18 బాలుర జట్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి జట్టు గెలుపే లక్ష్యంగా ఆడాలని, క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్లాలని, జట్టులో ఉన్న అందరూ కలిసికట్టుగా ఆడినప్పుడే విజయం సాధించవచ్చని తెలిపారు. ఓటమి మంచి గురువు అని, ఓటమి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చని, ఓటమికి కారణమైన పొరపాట్లను గుర్తించి మళ్లీ అవి పునరావృతం కాకుండా ఆటతీరును మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్న జట్లు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభతో వారి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్ పర్సన్ గాజుల ముఖేష్ గౌడ్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



