మహిళా రిజర్వేషన్ ఉద్దేశ్యంపై ప్రశ్నలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గ్రామ పంచాయతీల్లో మహిళా సాధికారత కోసం మహిళలను సర్పంచ్లుగా ఎన్నుకున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా సర్పంచ్ స్థానంలో ఉన్నది మహిళ అయినప్పటికీ, అసలు నిర్ణయాలు తీసుకుంటూ, సమావేశాల్లో మాట్లాడేది భర్తలేనని గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హాజీపూర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఎంపీడీవో, ఎంపీఓ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ స్థానంలో ఉన్న మహిళ కాకుండా ఆమె భర్తే మాట్లాడడం చర్చనీయాంశమైంది.
• “ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం”:
మహిళలకు ఇచ్చిన హక్కులను పురుషులు వినియోగించుకోవడం సరైనది కాదని గ్రామస్తులు మండిపడుతున్నారు. సర్పంచ్ బాధ్యతలు మహిళలదే కావడంతో, వారు స్వయంగా పాలనలో పాల్గొనాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
• కలెక్టర్ స్పందించాలి:
ఇలాంటి ఘటనలపై ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు..


