బక్రీద్ వేళ పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ భాస్కర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు మంచిర్యాల జోన్ తాండూర్ రేపల్లెవాడ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్పోస్ట్ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలిస్తూ వాహనాల తనిఖీలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పశువుల రవాణాకు సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. చెక్పోస్ట్ గుండా వెళ్లే ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అక్రమ పశువుల రవాణాపై పోలీసులు పటిష్ట నిఘా కొనసాగిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అనుమానాస్పద రవాణా కనిపిస్తే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. డీసీపీ వెంట తాండూర్ సీఐ దేవయ్య, బెల్లంపల్లి వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, తాండూర్ ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


