
మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ పరిధిలో నిర్మితమవుతున్న సమీకృత కలెక్టర్ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ భవన నిర్మాణ పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, రహదారులు-భవనాల శాఖ ఈ. ఈ. రాముతో కలిసి సందర్శించి కలెక్టర్ చాంబర్, వివిధ శాఖల గదులు, కారిడార్, కార్యాలయ ఆవరణ, నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఒకే చోట లభించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలలో భాగంగా జిల్లాలో పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా ప్రధాన కార్యాలయాలను కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం అవడంతో పాటు వేగంగా అందుతాయని తెలిపారు.
భవన సముదాయంలో ప్రతి శాఖ కొరకు గదులను కేటాయించడం జరిగిందని, వివిధ రకాల సేవల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల కొరకు అవసరమైన త్రాగునీరు, కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు కార్యాలయ ఆవరణలో మొక్కలు పెంచడం జరుగుతుందని తెలిపారు. భవన సముదాయ నిర్మాణంలో విద్యుత్ సరఫరా, ఇతర అంతర్గత పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


