ఖరీఫ్ 2022 – 23 సంవత్సరానికి గాను ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన కార్యచరణను రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో ఖరీఫ్ 2022 – 23 సంవత్సరానికి గాను ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన కార్యచరణను రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కల్టెరేట్ భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్ లో జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2022 – 23కు సంబంధించి రైతుల వద్ద నుండి ఎలాంటి అలసత్వం, అవకతవకలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు పూర్తి స్థాయి కార్యచరణ రూపొందించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నంబంధిత అధికారులు నిబద్ధతతో పని చేయాలని, రైతులకు బాసటగా నిలిచి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర సకాలంలో అందే విధంగా కృషి చేయాలని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రానికి వరిధాన్యం తీసుకువచ్చేప్పుడు నాణ్యమైన ధాన్యాన్ని తరలించడం, పాటించవలసిన నియమ, నిబంధనలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రణాళికబద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


