
చండీగఢ్: స్వాతంత్ర్య వేడుకలకు యావత్ దేశం సిద్ధమైన వేళ పంజాబ్ లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు హ్యాండ్ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు పిస్టోళ్లు, 40 క్యాట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ను పంజాబ్ -దిల్లీ పోలీసులు సంయక్తంగా నిర్వహించారు. “స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ పంజాబ్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ మద్దతు కలిగిన నలుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నాం. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్ తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశాం” అని పంజాబ్ పోలీసులు ట్విటర్ లో వెల్లడించారు.
ఆ ముఠా నుంచి మూడు హ్యాండ్ గ్రనేడ్లు (పి-86), ఐఈడీ, రెండు ఎం. ఎం. పిస్టోళ్లు, 40 కాట్రిడ్జ్ లు సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న వేళ పంజాబ్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

