
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని ఓటర్లు తమ ఓటర్ కార్డుకు ఆధార్కార్డు అనుసంధానం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన నముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు కార్డుకు ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేసుకోవాలని, ఇందు కొరకు స్వచ్ఛందంగా ఓటర్లు ముందుకు రావాలని తెలిపారు. ఆధార్ కార్డ్ నంబర్ ఓటర్ కార్డుకు అనుసంధానం చేయకపోయినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని, ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆధార్ నంబర్ ను ఓటర్ కార్డుకు అనుసంధానం చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రజాస్వామ్యానికి ఓటర్ జాబితా కీలకమైనదని, పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే ఓటరు జాబితా అత్యంత ప్రామాణికమని, వచ్చే ఎన్నికల నాటికి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించే ప్రక్రియలో భాగంగా ఆధార్ అనుసంధానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం వలన ఓటు హక్కును ఒక్కసారికి మించి వినియోగించే అవకాశం నివారించవచ్చని తెలిపారు.

