జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జీవకోటి మనగడ పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నియంత్రణ ద్వారానే సాధ్యపడుతుందని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ రాష్ట్ర నేషనల్ కోర్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ సందేశంతో రూపొందించిన బట్ట సంచులను జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి. రాహుల్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ పర్యావరణ మిత్ర బట్ట సంచులను వాడాలని తెలిపారు. పర్యావరణం, జీవకోటి మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు పర్యావరణ మిత్ర బట్ట సంచులనే వినియోగించాలని, బజారుకు వెళ్లే ప్రతిసారి బట్ట సంచులను తీసుకెల్లి మంచిర్యాలను సింగిల్ యూస్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని తెలిపారు. త్వరలో జిల్లాలో ఎంపిక చేసిన అన్ని యాజమాన్యాల గ్రీన్ కోర్ పర్యావరణ క్లబ్బులు గల ఉన్నత పాఠశాలలకు బట్ట సంచులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఏస్.యాదయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా సైన్సు అధికారి మధుబాబు, పర్యావరణ విద్య జిల్లా సమన్వయ కర్త గుండేటి యోగేశ్వర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


