• ఎన్నికల పరిశీలకులు •
– ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్,
– ఎన్నికల ఖర్చుల పరిశీలకులు అశోక్ కుమార్ సత్తార్, పవన్ సి.ఎస్,
– పోలీసు పరిశీలకులు ఆర్. ఇలంగో,
– జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ సాధారణ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ నెల 30న ఉదయం 7 గం||ల నుండి 4 గం॥ల వరకు పోలింగ్ ప్రక్రియ పకడ్బంధీగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్, ఎన్నికల ఖర్చుల పరిశీలకులు అశోక్ కుమార్ సత్తార్, పవన్ సి.ఎస్., పోలీసు పరిశీలకులు ఆర్. ఇలంగో, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో 003-బెల్లంపల్లి రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి. రాహుల్, డి.సి.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, 004-మంచిర్యాల రిటర్నింగ్ అధికారి రాములు, 002-చెన్నూర్ రిటర్నింగ్ అధికారి సిడాం దత్తు లతో కలిసి నోడల్ అధికారులు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియలను పకడ్బంధీగా నిర్వహించాలని అన్నారు. పోలింగ్ రోజున పట్టణ ప్రాంతాలలో 100 శాతం, గ్రామీణ ప్రాంతాలలో 60 శాతం వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, సంబంధిత ఏర్పాట్లను పోలింగ్ ముందు రోజు పరిశీలించుకోవాలని తెలిపారు. నిబంధనల ప్రకారం రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వాలంటీర్లు, మల్టీపర్పస్ వర్కర్లను తీసుకోవాలని, ఎన్.ఎస్.ఎస్. వారిని వాలంటీర్లుగా తీసుకోవాలని, ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో దివ్యాంగులను, 80సం||ల వయస్సు పైబడిన వయోవృద్ధులను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి, తిరిగి వారి నివాసాలకు చేర్చేందుకు ఒక ఆటో ఏర్పాటు చేయడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ సామాగ్రిని పూర్తి స్థాయిలో పరీక్షించుకోవాలని, ప్రతి సెక్టార్ అధికారి వాహనంలో జి.పి.ఎస్. ఏర్పాటు చేసి ఉండాలని, ప్రతి సెక్టార్ అధికారి పరిధిలో అదనంగా 2 వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనానికి ముందు, వెనుక సెక్టార్ అధికారి వాహనం అని వ్రాసి ఉండాలని తెలిపారు. సెక్టార్ అధికారులకు సంబంధించి భారత ఎన్నికల సంఘం చెక్లస్టు వచ్చిందని, ఇది ప్రతి సెక్టార్ అధికారి వద్ద ఉండాలని, ప్రిసైడింగ్ అధికారులకు జారీ చేసిన ఈ.వి.ఎం. ప్రొటోకాల్ ప్రతి ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉండాలని, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు, వాటి రూట్ మ్యాప్ అన్ని పకడ్బంధీగా నిర్వహించాలని తెలిపారు. వాహనాలు, వివిధ విభాగాల సిబ్బంది, వైద్య సిబ్బంది, వాలంటీర్లకు సంబంధించి కార్యచరణ రూపొందించి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ప్రణాళిక, రూట్ మ్యాప్, లేబులింగ్, జి.పి.ఎస్. ఇతరత్రా ప్రక్రియ పూర్తి చేయాలని, అన్ని అంచెలలో పర్యవేక్షణ కమిటీలు పనితీరును పరిశీలిస్తాయని తెలిపారు. కమెన్స్మెంట్ ఆఫ్ పోల్, మాక్ పోల్, ఈ, వి. ఎం.ల భర్తీ ఇతరత్రా కార్యక్రమాల కొరకు ఒక అధికారి ఉ ంటారని, వీటిని పర్యవేక్షిస్తూ నియోజకవర్గానికి ఒక పర్యవేక్షకుడు ఉంటారని తెలిపారు. పోలింగ్ సమయంలో జరుగుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు నివేదిక రూపొందించి అందించాలని, పోలీసు బందోబస్తు పకడ్బంధీగా ఏర్పాటు చేయాలని, 48 గంటల ప్రచార నిషేధిత సమయంలో పోలింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి ప్రచారాలు నిర్వహించకూడదని, అదే విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎక్కడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, అతిథి గృహాలు, ఇతరత్రా ప్రాంతాలలో ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాల నిర్వహణపై పోలీసు అధికారులు సంబంధిత అధికారుల సమన్వయంతో పర్యవేక్షించాలని, ఆఖరి 72 గం॥లలో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్, వీడియో సర్వేయలెన్స్, వీడియో పరిశీలన ఇతర అన్ని ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెకోపోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని, తనిఖీ ప్రక్రియను ఖచ్చితంగా వీడియో చిత్రీకరించాలని, అధిక మొత్తంలో నగదు తరలింపు, బదిలీలపై దృష్టి సారించాలని తెలిపారు. అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ఇతరులకు ఒక్కొక్క వాహనాన్ని అనుమతించడం జరుగుతుందని, ఒక్క వాహనంలో 5 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, అభ్యర్థికి సంబంధించి వాహనాలు తప్పనిసరిగా అభ్యర్థి మాత్రమే వినియోగించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఎలాంటి ప్రచారాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని, 200 మీటర్ల దాటిన తరువాత ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసుకోవచ్చని, ఒక అభ్యర్థికి సంబంధించి ఇద్దరు మాత్రమే ఉండాలని, ఓటర్లకు అందించే ఓటరు సమాచార స్లిప్పులపై పార్టీలకు సంబంధించి ఎలాంటి గుర్తులు, వివరాలు ఉండకూడదని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకోవాలని తెలిపారు. 72 గం॥ల వ్యవధిలో ప్రలోభ పెట్టే అంశాలకు సంబంధించి ఏవైనా లభించినట్లయితే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని, పోలీసు శాఖ, ఖర్చుల విభాగం అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. సి.ఎం.పి.ఎఫ్. సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పోలీసు, సి.ఎం.పి.ఎఫ్.. ఎన్నికల అధికారుల సమన్వయం కొరకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఖర్చులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని, అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దులలోని చెకోపోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, 24/7 విధులు నిర్వహించాలని, ఏవైనా నిబంధనలకు విరుద్దంగా లభించినట్లయితే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పంచనామా నిర్వహించి, సీజ్ చేయాలని, వీడియోగ్రఫీ చేయాలని, ఈ.వి.ఎం. తరలింపులో సి.ఎం.పి.ఎఫ్. సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఏర్పాటు చేసిన 3 రిసెప్షన్ కేంద్రాల వద్ద అందరు ఉండేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం. స్ట్రాంగ్ రూమ్లు, పోలింగ్ కేంద్రాలలో నిరంతరంగా విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, పోలీసు అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


