జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ సాధారణ ఎన్నికలు-2023లో భాగంగా ఈ నెల 30వ తేదీన పోలింగ్ అనంతరం డిసెంబర్ 3వ తేదీన చేపట్టనున్న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణలో కౌంటింగ్ సూపర్వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు, సహాయకులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో 003- బెల్లంపల్లి రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్, జిల్లా అదనపు పాలనాధికారి (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, 004-మంచిర్యాల రిటర్నింగ్ అధికారి రాములు, 002-చెన్నూర్ రిటర్నింగ్ అధికారి సిడాం దత్తు, జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. రమేష్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతిలతో కలిసి కౌంటింగ్ సూపర్వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు, సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ. సాధారణ ఎన్నికలలో భాగంగా ఈ నెల డిసెంబర్ 2వ తేదీన నిర్వహించనున్న 2వ విడత శిక్షణ కార్యక్రమంలో కౌంటింగ్ సంబంధిత అంశాలను పూర్తిగా నేర్చుకోవాలని, కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు విధానం, టేబుళ్లు, ఇతర ఏర్పాట్లపై శిక్షణ అనంతరం అదే రోజున గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ కొరకు నిర్ణయించిన సమయానికి ముందుగా అక్కడకు చేరుకొని సిద్దంగా ఉండాలని, కౌంటింగ్కు అవసరమైన ఏర్పాట్లు, బ్యాలట్, కంట్రోల్ యూనిట్లు, వి.వి. ప్యాట్లను ముందుగా పరిశీలించుకోవాలని, సక్రమంగా లేనట్లయితే ఏర్పాటు చేసుకునేందుకు అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పేపర్ సీల్స్, పేపర్లు ఇతరత్రా అన్ని పరిశీలించుకోవాలని, కౌంటింగ్ నిర్వహించేప్పుడు అధికారులతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలచే నియమించబడిన ఏజెంట్లకు కనిపించే విధంగా పూర్తి పారదర్శకంగా లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. వివరాలు నమోదు చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని, ఈ క్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రక్రియను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ఏదైనా పొరపాటు వచ్చినట్లయితే తిరిగి లెక్కింపు జరుగుతుందని, ఈ అవకాశం లేకుండా జాగ్రత్తగా లెక్కింపు చేయాలని తెలిపారు. ఫారం-17సి పార్ట్-2, ఈ.టి.పి.బి.ఎస్., 130, 13బి ఫారములు, పోస్టల్ బ్యాలెట్ ఫారములను పరిశీలించాలని, ఈ.వి.ఎం. నిర్వహణలో సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


