
ఆంజనేయులు న్యూస్: ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేటు కు విస్తృత అధికారాలను ఇచ్చే మనీలాండరింగ్ చట్టాన్ని సమీక్షించాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విచారణ నిర్వహించారు. ఈడీ అధికారాలకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పులో రెండు అంశాలను సమీక్షించాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈసీఐఆర్ (ఎన్ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు)ను ఇవ్వకపోవడం, నిందితుల అమయాకత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడాన్ని తిరస్కరించే అంశాలను పునః సమీక్షించాల్సి ఉందని నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం ద్వారా ఈడీకి లభించిన అధికారాలను సమర్థిస్తూ సుప్రీం కోర్టులో జస్టిస్ ఖన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ జులైలో తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుకు సంబంధించి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ.. తీర్పు మొత్తాన్నిపునః సమీక్షించడాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో తీర్పులోని రెండు అంశాలకు సంబంధించే నోటీసులను పరిమితం చేయాలని వాదించారు. మరోవైపు కార్తీ చిదంబరం తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పూర్తి తీర్పునే పునఃసమీక్షించాలని కోరారు.


