
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
మంచిర్యాల జిల్లా: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు ప్రతి సంవత్సరం జూలై నెలలో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా చేపట్టిన 8వ విడత కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముస్కాన్ 8వ విడత సమన్వయ సమావేశంలో ఎ.సి.పి. తిరుపతితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, జిల్లాలో బాల కార్మికులను గుర్తించి వారికి, వారి తల్లిదండ్రులు అవగాహన కల్పించడంతో పాటు డ్రాపవుట్ పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడంతో పాటు బాలలను కార్మికులుగా పని చేయించుకునే యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ 8వ విడత కార్యక్రమ నిర్వహణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందాల సభ్యులు జిల్లా అంతటా పర్యటించి బాలకార్మికులను గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు..
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి కె. చిన్నయ్య, సి. డబ్ల్యు.సి. చైర్మన్ ఎండి. వాహిద్, జిల్లా బాలల సంక్షేమ అధికారి ఎన్. ఆనంద్, జిల్లా అధికారులు, డి.సి.పి.యు., చైల్డ్ లైన్ సిబ్బంది నంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..


