రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మన్నెగూడలో కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని అపహరించిన ఘటన కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మన్నెగూడలో కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని అపహరించిన ఘటన కలకలం రేపింది. డీసీఎం, కార్లలో 100మందికి పైగా యువకులతో వచ్చిన నవీన్ రెడ్డి తమ కుమార్తెను తీసుకెళ్లినట్టు దామోదరెడ్డి, నిర్మల దంపతులు ఆరోపించారు. ఇంట్లోని సామగ్రి, సీసీ కెమెరాలు, కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. గతంలో నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు యువతి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయినప్పటికీ వేధిస్తున్న నవీన్ రెడ్డి.. పోలీసుల అండతోనే దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ఇంటి పై దాడికి పాల్పడుతున్న సమయంలో 100 నంబర్ కు కాల్ చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రహదారిపై బాధితులు ధర్నాకు దిగారు. ఈ ఘటనతో మన్నెగూడలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో నవీన్ రెడ్డి, యువతికి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితులు ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

