ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో అమలు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రైతులు, పట్టాదారులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ‘భూధార్’ పేరుతో సంబంధిత యజమానులకు కార్డులివ్వనుంది. ఆధార్ తరహాలో 14 అంకెలున్న భూధార్ కార్డులను యూఎల్ పిన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జారీచేయనుంది. ఇందుకు పైలెట్ ప్రాజెక్ట్ గా రంగారెడ్డి జిల్లాలోని 69 గ్రామాలను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా భూవివాదాలు, ఆక్రమణలున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
• గ్రామ నక్షాలు.. రెవెన్యూ రికార్డులు
భూధార్ కార్డుల జారీకి ముందు రెవెన్యూ అధికారులు ఒక సర్వే నంబర్ కు సంబంధించిన వివరాల కోసం.. గ్రామనక్షాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తారు. సేత్వారు, ఆర్ఆర్ రికార్డులను ప్రామాణికంగా తీసుకుని.. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. దస్త్రాల పరిశీలన పూర్తయ్యాక భూధార్ కార్డులకు తెలంగాణ సర్వే, సరిహద్దు చట్టం సెక్షన్6(1) ప్రకారం చట్టబద్ధత కల్పించనున్నారు.


