మంచిర్యాల, ఆగస్టు 3, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్లో రాముని చెరువు వద్ద సోమవారం మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. వన మహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
