పార్కులో ఆడుకుంటున్న చిన్నారిపై విచక్షణారహిత దాడి
కుక్కల నియంత్రణలో మున్సిపల్ యంత్రాంగం విఫలం.. ప్రజల్లో తీవ్ర ఆందోళన
మంచిర్యాల, ఆగస్టు 3, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఆదివారం ఉదయం హైటెక్ సిటీ ఓపెన్ జిమ్ పార్క్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధికుక్కలు విచక్షణారహితంగా దాడి చేయడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టి చిన్నారిని రక్షించారు. అనంతరం ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో హైటెక్ సిటీతో పాటు పట్టణంలోని పలు కాలనీల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వీధికుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో చిన్నారులు పార్కులకు వెళ్లేందుకు, ప్రజలు నడకకు రావడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. పట్టణంలో వీధికుక్కల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటి నియంత్రణలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ కుక్కల దాడి ఘటనలు జరిగినప్పటికీ శాశ్వత చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి వీధికుక్కలను పట్టివేయడం, వాటి నియంత్రణకు సమర్థవంతమైన కార్యాచరణ అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడకముందే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
