హాజీపూర్ మండలం గుడిపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) ఎం.హరితను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హాజీపూర్ మండలం గుడిపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) ఎం.హరితను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుడిపేట జేపీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన హరితపై ఆది నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మొదలు డీఎల్ పిఓ, పంచాయతీ అధికారి వరకు కూడా గుడిపేట పంచాయతీ తనిఖీల సమయంలో జేపీఎస్ వ్యవహారశైలీపై పలుమార్లు మందలించిన పని తీరు మెరుగుపడలేదు సరికాదా అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో పెరిగాయి. గుడిపేట ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, స్థానికులు జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదులు చేశారు. దీంతో జేపీఎస్ అవినీతి, అక్రమాలతో పాటు ప్రజాప్రతినిధుల ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ భారతీ హోళీ కేరీ, అదనపు కలెక్టర్ రాహుల్ స్పందించి విచారణ జరిపించి పూర్తి స్థాయి నివేదికను సిద్దం చేశారు. గుడిపేటలో గ్రామ పంచాయతీ సమావేశాలు, గ్రామసభల నిర్వహణలో వైఫల్యం. పంచాయతీ రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, తీర్మాణాలను పక్కదోవ పట్టించడం. క్యాష్ బుక్ నిర్వహణలో జాప్యం, పంచాయతీ ఈ పోర్టల్ లో పాత ఫోటోలు నమోదు చేయడం, ఇష్టారాజ్యంగా నిధులు వినియోగించడం, లాగ్బుక్, ట్రాక్టర్ బుక్ నిర్వహణలో లోపం, ఖచ్చితమైన బిల్లులు, వోచర్ల నిర్వహణ లోపం, చెక్కుల జారీలో లోపాలు, చెక్కుల తీర్మాణాలు లేకపోవడం, ఎంబీ రికార్డులు లేకుండా చెక్కులు జారీ చేయడం, అభివృద్ధి పనులకు సంబంధించి పాలకవర్గం తీర్మాణాలు లేకపోవడం, ఇంటి అనుమతుల విషయంలో అక్రమ వసూళ్లు, అధిక మొత్తంలో వసూళ్లు జరిపినట్లు విచారణలో వెల్లడి కావడంతో గుడిపేట జేపీఎస్ హరితపై సస్పెండ్ వేటు పడింది. ఇసుకపై పంచాయతీకి సమకూరిన రూ.78,56,945 ఆదాయం పక్కదారి పట్టడంలో కూడా జేపీఎస్ బాధ్యురాలు కావడంతో సస్పెండ్ కు గురైంది.
ఈ మేరకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు జేపీఎస్ లతో పాటు కార్యదర్శులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టమైన ఆదేశాలు చేశారు. కాగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు హాజీపూర్ ఎంపీడీఓ అబ్దుల్ హై ద్వారా గుడిపేట జేపీఎస్ హరితకు సస్పెండ్ ఉత్తర్వులను అందజేశారు. నంనూర్ జేపీఎస్ కు అదనపు భాధ్యతలు.. హాజీపూర్ మండల నంనూర్ గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి మల్లేశ్ కు గుడిపేట జేపీఎస్ అదనపు భాధ్యతలు అప్పగిస్తూ డీపీఓ ఫణీందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
