మహబూబాబాద్ లో భారాస కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఆంజనేయులు న్యూస్, మహబూబాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు మహబూబాబాద్ వచ్చానని.. అప్పట్లో ఈ ప్రాంతంలో బాగా కరవు ఉండేదని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో పనులు సుకున్నామని చెప్పారు. మహబూబాబాద్ లో భారాస కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. చాలా జిల్లాల్లో కొత్తగా కలెక్టరేట్లు నిర్మించుకున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో అనేక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని.. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ. 50కోట్లు.. జిల్లాలోని మిగిలిన డోర్నకల్, మరిపెడ, తొర్రూరు పట్టణాలకు రూ.25 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు కేసీఆర్ వివరించారు.
కేంద్రంలోనూ పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే దేశం బాగా అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ అన్నారు. దేశ అభివృద్ధిలోనే మన అభివృద్ధి ఇమిడి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తు రాజకీయాల్లో దేశానికే ఓ వెలుగు మార్గం చూపించే అద్భుతమైన చైతన్య వీచిక మన తెలంగాణ నుంచే వీయాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో తాను ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ప్రజలు అద్భుతంగా స్పందించి సహకరించారని చెప్పారు. ఇప్పుడు కూడా దేశ అభివృద్ధి కోసం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కేసీఆర్ కోరారు.
