జాడ లేని కుక్కల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు
పట్టించుకోని సంబంధిత అధికారులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరి పైన దాడి చేస్తున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు… దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో రాంనగర్, ఎల్ఐసి కాలనీ, గ్రీన్ సిటీ, మరియు పట్టణంలోని పలు కాలనీలలో కుక్కల బెడద ఎక్కువవుతోంది.. తాజాగా రాంనగర్ కాలనీలో సోమవారం దీపావళి సందర్భంగా పనులు నిమిత్తం కిరాణా షాపుకు వెళ్తుంటే ఓ అమ్మాయి వెంట కుక్కలు పడ్డాయి.. ఇది గమనించిన స్థానికులు అమ్మాయిని కుక్కల భారీ నుండి కాపాడారు.. గతంలో ఆయా మున్సిపాలిటీల్లో కుక్కలను బందించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టడం వంటివి చేపట్టేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కుక్కల సంతతి సైతం పెరిగింది.
• జాడ లేని కుక్కల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు:
కుక్కల సంఖ్య పెరగకుండా మున్సిపాలిటీ పరిధిలో జంతు సంతాన నిరోధక కేంద్రాలకు కుక్కలను తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించాలి.. అనంతరం రేబిస్ టీకా ఇప్పించి ఎక్కడి నుంచి వాటిని తీసుకొచ్చారో అక్కడే వదిలివేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇలా జరగడం లేదు. వీధి కుక్కలకు టీకాలు వేయాల్సి ఉండగా అధికారులు పట్టించుకోకపోవడంతో బెడత తీవ్రమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
• నియంత్రణకు ప్రభుత్వ మార్గదర్శకాలు.:
పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకరావడం. కుక్కల కుటుంబ నియంత్రణ వేగవంతం చేయడం, కుక్క కాటు ప్రమాదాల నియంత్రణ చర్యలు చేపట్టడం, ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో వెటర్నరీ బృందాలను తరలించి కుక్కలను కట్టడి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పెంపుడు కుక్కలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, హోటల్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్, చికెన్, మటన్ సెంటర్లు వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయడం, వీధి కుక్కల అంశంపై హోర్డింగ్స్, పోస్టర్స్, బిల్బోర్డ్స్తో ప్రచారం చేయడం, వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా నీటి వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవడం వంటివి చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో సూచించింది.
• బయపడుతున్న జనం:
కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. పట్టణంలోని పలు కాలనీలో వీధి దీపాలు సైతం సరిగా లేకపోవడంతో కుక్కలు గుంపులు, గుంపులుగా సేద తీరుతున్నాయి. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి పై కుక్కలు దాడి చేస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లే వారు కుక్కల బారిన పాల్పడుతుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు తీసుకొని కుక్కల దాడులు ఆపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..


