విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరీ
70 వేల నగదు అపహరణ
వివరాలు సేకరించిన
సర్కిల్ ఇన్స్పెక్టర్ బుద్దే రవీందర్

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం రోడ్ లో గల మాతృ శ్రీ డిగ్రీ కళాశాల సమీపంలో నివాసం ఉండే విశ్రాంత ఉద్యోగిని కొలిపాక వరలక్ష్మి ఇంట్లో చోరీ జరిగిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కొలిపాక వరలక్ష్మి గత కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. అత్యవసర పనిమీద మంగళవారం తమ కుమార్తె గ్రామమైన కెరమెరి మండలానికి వెళ్లారు. బుధవారం ఉదయం వరలక్ష్మి కోడలు కవిత గమనించగా కాంపౌండ్ వాల్ కు సంబంధించిన గేట్లకు వేసిన తాళాలు అలాగే ఉండగా ప్రధాన ద్వారం తలుపులకు సంబంధించిన బెడం పగలగొట్టి ఉంది. భయభ్రాంతులకు గురైన ఆమె కోడలు కవిత వెంటనే తన అత్తమ్మ వరలక్ష్మికి ఫోన్ లో సమాచారం అందించగా ఆమె చేరుకుని ఇల్లు చిందరవందరగా పడి ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. అత్యవసర పనుల నిమిత్తం బీరువాలో దాచిన 70 వేల రూపాయల నగదు కనిపించకుండా పోయేసరికి బోరున విలపించారు. చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ బుద్దే రవీందర్ చోరీ జరిగిన తీరును పరిశీలించగా, ఫింగర్ ప్రింట్ పోలీసు అధికారులు పలు ఆధారాలు సేకరించారు. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


