
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఎందరో అంద దివ్యాంగులు తమ వైకల్యాన్ని అధిగమించి తాము ఎంచుకున్న రంగాలలో విజయం సాధించాలని, వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. బుధవారం లూయిస్ బ్రెయిలీ 214వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్తో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు వైకల్యం ఉందని నిరాశ పడకుండా వైకల్యాన్ని ఎదురించి ఉన్నత స్థాయిలో నిలిచిన వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. తన ఐ.ఎ.ఎస్. బ్యాచ్ లో ఒకరు దివ్యాంగులు ఉండే వారని, ఎంచుకున్న లక్ష్యాన్ని అధిగమించడంలో స్ఫూర్తినిచ్చారని, ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. వైకల్యం అనేది శరీరానికి మాత్రమేనని మనసుకు, ఆలోచనకు కాదని, పిల్లలు అందరు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం బ్రెయిలీ లిపిలో ఉన్న క్యాలండర్, వికలాంగుల చట్టాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి చిన్నయ్య, సి.డి.పి.ఓ. హిమసత్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


