
రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని సాయి మాధవ్ హోటల్లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్లోని ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు, వంట సామగ్రి, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం అంచనా వేస్తోంది. అయితే అర్ధరాత్రి సమయంలో హోటల్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.


