నకిలీ నగలతో ప్రజలను మోసం చేసిన సూర్యాభాయ్
పాపులారిటీ కోసం నకిలీ బంగారం డ్రామా

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లో “గోల్డ్ మ్యాన్”గా ప్రసిద్ధి చెందిన సూర్యాభాయ్ అసలు రూపం బయటపడింది. ఇన్నాళ్లుగా భారీ బంగారు నగలతో ప్రజల ముందు మెరిసిన ఆయన, వాస్తవానికి నకిలీ (ఇమిటేషన్) నగలు ధరించినట్లు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల విచారణలో తేలింది. ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు సూర్యాభాయ్పై దృష్టి సారించి విచారణ చేపట్టగా, ఆయన వద్ద ఉన్న నగల అసలు విలువపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన వద్ద కోటి రూపాయల విలువైన బంగారం ఉందని ప్రచారం చేసుకున్నప్పటికీ, విచారణలో అవి కేవలం రూ.2.8 లక్షల విలువ చేసే రోల్డ్ గోల్డ్ నగలేనని అధికారులు గుర్తించారు. విచారణలో మరో ఆశ్చర్యకర విషయం బయటపడింది. సూర్యాభాయ్ అసలు పేరు పల్లపు సురేష్ కుమార్ కాగా, ఆయన పెద్ద వ్యాపారవేత్త కాదని, సాధారణంగా జీవనం సాగిస్తున్నాడని తెలిసింది. నగరంలో ఒక చికెన్ షాప్ నిర్వహించడంతో పాటు జిమ్ ట్రైనర్గా కూడా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకాలం టీవీ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికలపై “బంగారుబాబు”గా ప్రసిద్ధి చెందిన సూర్యాభాయ్, తన ప్రత్యేక స్టైల్తో ప్రజల్లో మంచి గుర్తింపు పొందాడు. సినిమాల్లో కూడా అవకాశాలు పొందినట్లు సమాచారం. అయితే, ఈ వెలుగుల వెనుక ఉన్న నిజం ఇప్పుడు బయటపడడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అధికారుల ప్రశ్నలకు సమాధానంగా సూర్యాభాయ్ తాను పాపులారిటీ కోసం, అలాగే రియల్ ఎస్టేట్ మరియు సినిమా అవకాశాల కోసం ఇలా నకిలీ నగలు ధరించానని అంగీకరించినట్లు తెలిసింది. ఈ ఘటనతో “మెరిసేది అంతా బంగారం కాదు” అనే సామెత మరోసారి నిజమైంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతీ విషయం నిజం కాదని ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది.


