ఎంటెక్, ఎంఫార్మసీ సీట్ల భర్తీకి రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు కొత్త పంథాలో దందాకు తెరలేపాయి.
ఒకే ఒక్క కోర్సుకు ఐచ్ఛికం ఇచ్చిన 300 మంది ఎంటెక్, ఎంఫార్మసీ అభ్యర్థులు
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ సీట్ల భర్తీకి రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు కొత్త పంథాలో దందాకు తెరలేపాయి. అభ్యర్థులు కేవలం తమ కళాశాలలోని కోర్సుకే ఆప్షన్ ఇచ్చుకునేలా చేస్తున్నాయి. బీటెక్, బీఫార్మసీ పూర్తయిన కళాశాలలోనే పీజీ చేయాలని, లేకుంటే బకాయి ఫీజులు చెల్లించాలన్న షరతును విద్యార్థులకు పెడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. తాజా పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈ సెట్) కౌన్సెలింగ్ లో ఒకే ఒక కళాశాలలో, ఒకే ఒక్క ఆప్షన్ ఇచ్చుకున్న వారు 300 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వారిలో 100 మంది వరకు వర్సిటీ కళాశాలలు (ప్రభుత్వ), మిగిలిన 200 మంది వరకు ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఉన్నారని తేల్చారు. మొత్తం 300 మందిలో 67 మంది ఎంఫార్మసీ అభ్యర్థులు కాగా, మిగిలిన వారు ఎంటెక్ కోర్సులకు ఐచ్ఛికం ఇలా ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో 216 మందికి మాత్రమే సీట్లు వచ్చాయి. సాధారణంగా ఉత్తమ ర్యాంకర్లు వర్సిటీ కళాశాలల్లో లేదా మరో ఒకటీ రెండు కళాశాలల్లోనే ఆప్షన్లు ఇచ్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు.


