రామగుండం సిపి రెమా రాజేశ్వరి

ఆంజనేయులు న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు -2023 సందర్భంగా నవంబర్ 30న ఎన్నికలు ఉన్నందున పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు తేదీ నవంబర్ 28వ సాయంత్రం 5 గంటల తరువాత నుంచి, డిసెంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ (డిఐజి) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. రామగుండం పోలీస్ కమీషనరరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు. రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించొద్దని, ప్రదర్శించొద్దని తెలిపారు. మైకులు, లౌడ్ స్పీకర్లు వాడరాదని, రాజకీయ పార్టీలకు సంబందించిన పాటలు, ఉపన్యాసాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటి కార్యక్రమాలను నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై, మరియు ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.


