రీ సర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
మంచిర్యాల, జూలై 24, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్తో కలిసి పాల్గొన్న ఆయన రీ సర్వే వల్ల భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ, భూముల సర్వే, మ్యాపింగ్ ద్వారా హద్దులు స్పష్టంగా నిర్ధారించడంతో పాటు ప్రభుత్వ భూములు, పట్టా భూముల వివరాలు ఖరారవుతాయని తెలిపారు. పట్టా, మోకా రికార్డుల్లో ఉన్న వ్యత్యాసాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరిచేస్తామని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే అనంతరం రూపొందించే మ్యాపింగ్ ఆధారంగా భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గడమే కాకుండా న్యాయపరమైన పరిష్కారం కూడా సులభమవుతుందని చెప్పారు. భూములకు సంబంధించిన స్పష్టమైన వివరాలను ఇప్పుడే నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సర్వేయర్లు, ప్రజల సహకారంతో రీ సర్వేను పారదర్శకంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పురోగతిని సమీక్షించారు. భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 90 శాతం పూర్తయిందని, గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. చిన్న వెంకటాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. హాజరు పట్టికలో ఒక ఉపాధ్యాయుడు గైర్హాజరుగా ఉండటాన్ని గమనించి, సెలవు పత్రం లేకపోతే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలోని సౌకర్యాలు, గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను కూడా పరిశీలించిన కలెక్టర్, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
