
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పత్రికా రంగం విశ్వసనీయతను దెబ్బతీస్తూ జర్నలిస్టుల పేరుతో ముసుగులు వేసుకుని ప్రజలను బెదిరించే ఘటన గురువారం మంచిర్యాలలో వెలుగులోకి వచ్చింది. ఓ న్యూస్ ఛానల్ పేరిట నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకుని బార్ మేనేజర్లను, వ్యాపారులను ఉచిత సేవలకు ఇవ్వాలని ఒత్తిడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టౌన్ ఎస్సై మజారోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్పీ రోడ్లోని శ్రీ సాయి శ్రీనివాస బార్లో సయ్యద్ సిరాజ్ అనే వ్యక్తి మద్యం సేవించి ఉచిత బిర్యానీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే మీడియా పేరుతో ఇబ్బందులు కలిగిస్తానని హెచ్చరించాడు. విచారణలో సిరాజ్ స్నేహితుడు బండి కిరణ్, ఓ న్యూస్ ఛానల్ పేరిట నకిలీ ఐడీ కార్డు తయారు చేసి ఇచ్చినట్టు బయటపడింది. ఇద్దరూ కలిసి కొంతకాలంగా జర్నలిస్టుల ముసుగులో వ్యాపారులను బెదిరిస్తూ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోర్టులో హాజరుపర్చిన వారిని మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా, వారిని లక్షేట్టిపేట జైలుకు తరలించారు. జర్నలిస్టుల పేరుతో దందాలు జరపడం పత్రికా రంగం పై చెడు ముద్ర వేస్తోందని, నిజమైన జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
