మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
భర్త, కుటుంబసభ్యుల వేధింపులే కారణమని ఆరోపణ
పెళ్లిరోజు వేడుకల్లో జ్యోతి, బాలకృష్ణ
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. బాలకృష్ణతో పాటు అతడి కుటుంబసభ్యుల వేధింపులతోనే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడినట్లు జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రాంబాబు, రవీంద్రకుమారి ఆరోపించారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించిన వివరాల మేరకు.. “మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఫోన్ చేసి తన భర్త చంపేలా ఉన్నారని చెప్పింది. ఆత్మహత్య వెనుక అనుమానం ఉందని, న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని వారు స్పష్టం చేశారు. వివాహ సమయంలో మూడు ఎకరాల భూమితో పాటు రెండు లక్షల నగదు, బంగారు నగలు కట్నంగా ఇచ్చాం. మున్సిపల్ కమిషనర్ ఎంపికైన తర్వాత నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ. కోట్ల కట్నంతో పాటు అందమైన భార్య వస్తుందని పదేపదే వేధించేవారు. బాలకృష్ణకు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయన్నారు. ఇంటి లోపల శాడిస్ట్ గా సైకోగా, బయట మంచివాడిగా ప్రవర్తించే వారన్నారు. అమ్మను నాన్న తరచూ తిట్టేవారని పాప భవిష్య తమ అమ్మమ్మ, తాతలకు చెప్పినతీరు వారిని కలిచివేసింది. సీఐ నారాయణనాయక్ బాలకృష్ణపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో జ్యోతి మృతదేహం తరలింపునకు కుటుంబసభ్యులు అంగీకరించారు.
జ్యోతి మృతదేహం వద్ద రోధిస్తున్న తల్లిదండ్రులు
• ఏడాదిన్నర క్రితం నిర్మల్ మున్సిపల్ కమిషనర్ పనిచేస్తున్న బాలకృష్ణ మంచిర్యాలకు బదిలీ అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్షెట్టిపేటరోడ్ లొనీ ఆదిత్య ఇన్ క్లెయిన్ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్నారు. రోజుమాదిరిగానే ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లగా బాలకృష్ణ విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన బాలకృష్ణ తలుపు కొట్టగా భార్య జ్యోతి నుంచి ఎలాంటి స్పందన లేదు. రెండ్రోజులుగా కొంత జ్వరంతో బాధపడుతున్న జ్యోతి నిద్రిస్తుందని భావించారు. పదినిమిషాలైన తలుపు తీయకపోవడంతో కిటికిలో నుంచి చూడగా గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే పక్క ఇంటి వ్యక్తి సహాయంతో తలుపును గట్టిగా తన్ని లోనికి వెళ్లారు. ఉరివేసుకొని ఉన్న జ్యోతిని కిందికి దించి చూడగా అప్పటికే మృతిచెందినట్లు భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. డీసీపీ సుధీర్ రామ్ నాథ్ కెకాన్ తో పాటు ఏసీపీ తిరుపతి రెడ్డిలు ఘటన జరిగిన తీరును పరిశీలించారు. జ్యోతితో పాటు బాలకృష్ణల చరవాణులను సీజ్ చేసి కాలనీవాసులతో పాటు ఇంటి పనిమనిషితో మాట్లాడి. పలు విషయాలు తెలుసుకున్నారు. బాలకృష్ణ సొంత ఊరు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశావపురం. జ్యోతి స్వస్థలం కొణిజర్ల మండలం సీతారామపురం. వీరికి ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో 2014, ఆగస్టు 14న వివాహమైంది. తొలుత కానిస్టేబుల్ గా నియమితులై హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ.. గ్రూప్- 2 ద్వారా 2020లో మున్సిపల్ కమిషనర్ గా ఎంపికయ్యారు. వీరికి రిత్విక్ (8), భవిష్య (6) ఉన్నారు.
ఈ చిన్నారులను విడిచి ఎలా వెళ్లాలనిపించిందమ్మా
ఎంత పని చేసావమ్మా
రోజుమాదిరి పిల్లలను ముద్దుగా తయారు చేసింది. కానీ ఆ పిల్లలకు తెలియదు. ఇదే అమ్మ చేతులతో చివరి ఆలనా అని. పాఠశాల నుంచి ఒక్కసారిగా ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నారని.. ఇంటి వద్ద ఇంత మంది ఎందుకున్నారని వారి చూపుల్లో కనిపించింది. ఇంట్లోకి వెళ్లిన ఆ చిన్నారులకు అమ్మ కనిపించకపోవడంతో ఎక్కడంటూ అందరిని అడిగిన తీరు కంటతడి పెట్టించింది. ఈ చిన్నారులను విడిచి ఎలా వెళ్లాలనిపించిందమ్మా అనే మాట అక్కడ అందరి మదిలోన అనిపించింది.
