భోజనం అనంతరం వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు
నిర్లక్ష్యంగా వ్యవహరించారని పాఠశాల సిబ్బందిపై ఆరోపణలు
బెల్లంపల్లి, ఆగస్టు 1, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర ఆశ్రమ గురుకుల పాఠశాలలో శనివారం భోజనం చేసిన అనంతరం ఏడుగురు విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, వికారం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల పరిస్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకుని వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమకు అస్వస్థత కలిగినప్పటికీ పాఠశాల సిబ్బంది కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదని బాధిత విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యంపై బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు వెంటనే స్పందించి, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్కు గల అసలు కారణాలపై అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో బెల్లంపల్లిలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. పాఠశాలల్లో అందించే ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
