తెలంగాణ జూలై 18, ( ఆంజనేయులు న్యూస్ )
ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేసే ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కఠిన హెచ్చరిక జారీ చేసింది. విద్యార్థులు కోరిన వెంటనే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ), కండక్ట్ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్తో పాటు ఇతర ఒరిజినల్ ధ్రువపత్రాలను ఎలాంటి ఆలస్యం లేకుండా అందజేయాలని స్పష్టం చేసింది. ఫీజులకు సంబంధించిన వివాదాలను చట్టబద్ధమైన మార్గంలో పరిష్కరించుకోవాలని, విద్యార్థుల సర్టిఫికెట్లను బందీగా ఉంచి వారి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు ఆటంకం కలిగించడం చట్టవిరుద్ధమని బోర్డు పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే చర్యలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. బోర్డు ఆదేశాలను ఉల్లంఘించే కాలేజీలకు ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, అవసరమైతే అనుబంధ గుర్తింపును రద్దు చేయడం లేదా కాలేజీలను మూసివేసే వరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి స్పష్టం చేసింది.
