ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులకు ఆదేశాలు
ఆంజనేయలు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని పలు వీధుల్లో కాలినడకన పర్యటించిన మంత్రి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులపై ప్రజలు చేసిన వినతులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. మంత్రి పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

