- మార్కెట్ పనులతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రద్దీ..
- వేగంగా దూసుకెళ్తున్న వాహనాలతో ప్రమాదాల భయం
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పట్టణంలోని మార్కెట్ ఏరియాలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన రహదారులకు బదులుగా వాహనదారులు కాలనీల గల్లీలను ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇక్బాల్ అహ్మద్ నగర్ లో పెద్ద రోడ్డు అవడంతో గల్లీల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో కొందరు వాహనదారులు అతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పలుచోట్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. గల్లీల్లో చిన్నారులు ఆడుకోవడం, వృద్ధులు నడవడం, మహిళలు రాకపోకలు సాగించడం సాధారణమే కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది. అందువల్ల మున్సిపల్ అధికారులు, సంబంధిత కార్పొరేటర్లు వెంటనే స్పందించి ప్రమాదాలు జరగకముందే గల్లీల్లో అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

