ఒక మొక్క.. రేపటి తరానికి ఊపిరి”: డీఎంహెచ్వో డాక్టర్ ఎస్. అనిత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల, జిల్లా: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన బ్యానర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో వర్షాకాలం ప్రారంభమైన వెంటనే మొక్కలు నాటాలని, ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మొక్కల పెంపకం ద్వారా ప్రకృతిని సంరక్షిస్తూ భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, అవసరం లేని వాహన ప్రయాణాలను నివారించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. సమీప ప్రాంతాలకు నడక ద్వారా వెళ్లడం అలవాటు చేసుకోవాలని, ప్యాకెట్ ఫుడ్, జంక్ ఫుడ్, మైదా పదార్థాలు, కూల్డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ఇవి ఆరోగ్యంతో పాటు పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. “ఈ భూమి మనకు వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, మన పిల్లల నుంచి తీసుకున్న అప్పు” అని పేర్కొంటూ, ఒక మొక్క నాటడం అంటే రాబోయే తరాలకు ఊపిరిని అందించినట్టేనని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, నడక, యోగా, చెట్ల పెంపకం వంటి అంశాలను ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అసంక్రమణ వ్యాధుల కోఆర్డినేటర్ కాకిరాల వెంకటేశ్వర్లు, లక్ష్మణస్వామి, శ్రీనివాస్, ఆర్.ఎస్. పద్మ, వసుమతి, రవికిరణ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
