విశ్వాసానికి ప్రతీకైన కుక్కకు గౌరవం – ప్రజల సమస్యకు వెంటనే స్పందన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణంలోని 15వ వార్డు టేకులబస్తి గుడి ముందు ఒక కుక్క చనిపోవడంతో అక్కడ దుర్వాసన వ్యాపించి వార్డు ప్రజలు, గుడికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఉదయం స్థానికులు 15వ వార్డు టేకులబస్తి కౌన్సిలర్ చింతల వసంత కి తెలియజేశారు. దీనికి వెంటనే స్పందించిన ఆమె తన కుమారుడు చింతల లోకేష్ను ఘటన స్థలానికి పంపించారు. అక్కడికి చేరుకున్న లోకేష్ చనిపోయిన కుక్కను స్వయంగా తొలగించి సమీప ప్రాంతంలో ఖననం చేసి పరిసరాల్లో పరిశుభ్రత నెలకొనేలా చర్యలు చేపట్టారు. దీంతో అక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. మనుషుల పట్ల అపారమైన విశ్వాసం, నిబద్ధత చూపించే జంతువుల్లో కుక్కకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి విశ్వాసానికి ప్రతీకగా భావించే కుక్క చనిపోయినప్పుడు దానిని గౌరవంగా ఖననం చేయడం ద్వారా చింతల లోకేష్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడమే కాకుండా జంతువుల పట్ల కరుణ, మానవత్వం చూపిన ఆయన చర్యను స్థానికులు అభినందించారు. 15వ వార్డు టేకులబస్తి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్ సేవాభావాన్ని ప్రశంసించారు.
