ఏడాదిగా రాయితీ బియ్యానికి దూరం
ప్రస్తుతం రుణమాఫీ జాబితాలోనూ పేరు లేదు
పట్టించుకోని సంబంధిత అధికారులు

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కళ్లముందు కనిపిస్తున్నా.. అధికారుల దృష్టిలో ఆయన మరణించినట్లు లెక్క. ఆహార భద్రతా కార్డులో మృతి చెందినట్లు నమోదు చేసి పేరు తొలగించడంతో. ఏడాదిగా రాయితీ బియ్యానికి దూరమయ్యారు. ప్రస్తుతం రుణమాఫీ జాబితాలోనూ ఆయన పేరు లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వచ్చిన ఆయనకు విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. మృతి చెందినట్లు నమోదై ఉండటమే కారణం..
వివరాల్లోకి వెళితే : లింగాపూర్ మండలం నడ్డంగూడకు చెందిన బానోత్ మంగియ.. కుటుంబ ఆహార భద్రతా కార్డులో ఆయనతో పాటు భార్య మేనాబాయి పేర్లు ఉన్నాయి. కొన్ని నెలల కిందట అకస్మాత్తుగా కార్డు నుంచి ఆయన పేరు తొలగించారు. అప్పటి నుంచి ఒక్కరికే బియ్యం వస్తున్నాయి. సంబంధిత కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. పేరు ఎందుకు తొలగించారో చెప్పలేదని వాపోయారు. దీంతోపాటు మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గతంలో రూ. లక్ష రుణం తీసుకోగా.. ఏటా పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. మాఫీ జాబితాలో పేరు రాలేదన్నారు. రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకోవాలని పలువురు చెప్పడంతో.. జిల్లా కేంద్రానికి వచ్చారు. రేషన్ కార్డు స్టేటస్ లో పరిశీలిస్తే.. మృతి చెందినట్లు నమోదై ఉండటంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలి, ఎవరికి చెప్పాలలని తలపట్టుకుంటున్నారు. ఈ ఉదంతంతో బతికున్న వ్యక్తిని మృతి చెందినట్లు నమోదు చేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డులో తన పేరు నమోదు చేసి రుణమాఫీ ఇప్పించగలరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
