
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులు కేటాయించబడిన అధికారులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి ఐదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని 004-మంచిర్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో బాధ్యత వ్యవహరించాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బంధీగా వ్యవహరించాలని తెలిపారు. ఈ నెల 30 పోలింగ్ రోజున పూర్తి స్థాయిలో ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఓటు విలువ, అవశ్యతకను వివరించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం నియమించబడిన ప్రత్యేక బృందాలు, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ చేపట్టడానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ఇతర ఎన్నికల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా సంబంధిత అధికారుల సమన్వయంతో పని చేయాలని, జిల్లాలో ఓటర్ స్లిప్పులు పంపిణీపై కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. అనంతరం కార్యాలయ రికార్డులు, రిజిస్టర్లు, ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 004 మంచిర్యాల రిటర్నింగ్ అధికారి, రాజస్వ మండల అధికారి రాములు, నోడల్ అధికారి నీరటి రాజేశ్వరి, మంచిర్యాల, దండేపల్లి, నస్పూర్ తహశీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
