
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో దాడిచేసిన సంఘటన వాంకిడి మండలం ధాభా గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వాంకిడి ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ధాభా గ్రామానికి చెందిన వడ్డె అమృత, మారుతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వడ్డె మారుతి కొన్నాళ్లుగా మద్యానికి బానిసై భార్యను అనుమానంతో వేదిస్తున్నాడు. శనివారం రాత్రి మారుతి భార్యతో పాటు అదే గ్రామానికి చెందిన పోచ్చుతో ఘర్షణ పడ్డాడు. ఈ ఘర్షణలో ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య అమృత, పొచ్చు ఇద్దరిపై దాడి చేశాడు. ఈ దాడిలో అమృత అక్కడికక్కడే మృతి చెందగా, పొచ్చ పరిస్థితి విషమంగా ఉంది. అతనిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ తెలిపారు.
