
అదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఐటీ, జీ. ఎస్. టీ అధికారి పేరుతో పట్టణంలో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మావల పోలిస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. ఉట్నూర్ మండలానికి చెందిన శివకరణ్ కాగ్నే అనే యువకుడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మోసానికి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రముఖ బట్టల వ్యాపారి మొబైల్ నంబర్ ను తెలుసుకుని ఆయనకు GST, IT అధికారి పేరుతో బెదిరింపులకు గురి చేశాడని వెల్లడించారు. బాధితుడిని ఓ లాడ్జ్ కు తీసుకెళ్ళి. కాళ్ళు, చేతులు కట్టేసి సుత్తితో తలపై కొట్టి మానసికంగా, శారీరకంగా హింసించాడని పేర్కొన్నారు. తిరిగి సదరు వ్యాపారిని బెదిరించి అయిదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని, బాధితుడు వెంటనే డబ్బులు సర్దుబాటు చేయడంతో వాటిని తీసుకుని పరారయ్యాడని తెలిపారు. బాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపామని ఎస్పీ వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశామని, విచారణలో తాను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని వెల్లడించారు. నిందితుడి వద్ద 60 వేల విలువైన సెల్ ఫోన్, జల్సాలకు వాడుకోగా మిగిలిన 3 లక్షల 35 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరానికి ఉపయోగించిన తాడు, సుత్తి, సిమ్ కార్డ్ లను సైతం జప్తు చేసినట్లు వివరించారు. అధికారులు పేరిట బెదిరింపులకు పాల్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం చేరవేయాలని ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు సూచించారు.
