
దిల్లీ: సర్వీసు ఛార్జీ (service charge) విషయమై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుత్తున్న నేపథ్యంలో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల నుంచి ఎలాంటి సర్వీసు ఛార్జీలూ వసూలు చేయకూడదని రెస్టారెంట్ లు హోటల్స్ కు (Hotels, restaurants) సూచించింది. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు తెలిపింది. ఈ మేరకు సీసీపీఏ సోమవారం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు సీపీపీఏ పేర్కొంది.
• హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో ఆటోమేటిక్ గా లేదా డిఫాల్ట్ సర్వీసు ఛార్జీని వసూలు చేయడానికి వీల్లేదు..
• ఏ ఇతర పేరుతోనూ సర్వీసు ఛార్జీని వసూలు చేయకూడదు.
• సర్వీసు ఛార్జీ పేరుతో హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుడుపై ఒత్తిడి తీసుకురాకూడదు.
• సర్వీసు ఛార్జీ గురించి ముందుగానే వినియోగదారుడికి తెలియజేయాలి. అది వారి ఐచ్ఛికానికే వదిలేయాలి.
• సర్వీసు ఛార్జీల ఆధారంగా వినియోగదారులకు ప్రవేశం లేదా సేవల్లో పరిమితులు విధించకూడదు.
• ఎవరైనా వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీసు ఛార్జీ విధిస్తే వెంటనే బిల్లు నుంచి తొలగించాలని కోరవచ్చు.
• సదరు రెస్టారెంట్స్ పై నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ (NCH)కు 1915కి ఫోన్ చేయడం ద్వారా గానీ, ఎన్సీ హెచ్ మొబైల్ యాప్ ద్వారా గానీ ఫిర్యాదు చేయొచ్చు.
• వినియోగదారుల కమిషన్, ఈ-దాఖిల్ పోర్టల్, సీసీపీఏకు ఈ-మెయిల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
•వినియోగదారుల ఫోరాల్లో సర్వీసు ఛార్జీల విషయంలో వినియోగదారులకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయని గుర్తు చేసింది…
