
నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలో ప్రమాదం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు కార్యాలయ పైకప్పు పెచ్చులు ఊడిపోయాయి. భయాందోళనలకు గురైన సిబ్బంది కార్యాలయం నుండి బయటకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గోడ ఒక్కసారిగా కూలింది. అయితే అధికారులు మాత్రం కార్యాలయం లోపల పనిచేస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. పై కప్పు కూలిన సమయంలో ప్రజలు ఆ ప్రదేశంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ కార్యాలయాన్ని 1928 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి నుంచి ప్రజలకు సేవలందిస్తూ వచ్చింది. అయితే ఇటీవల కురుసిన భారీ వర్షాలకు కార్యాలయం పూర్తిగా తడిసిపోయింది. పురాతన కార్యాలయం కావడంతో ఒక్కసారిగా పై కప్పు కూలిపోయింది..
ఈ విషయమై తహసీల్దార్ సుభాష్ చందర్ మాట్లాడుతూ.. పురాతన తహసీల్దార్ కార్యాలయం ఇప్పటి వరకు సేవలందించిందని, భవనం కూలి పోతుండడం బాధాకరంగా ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూతన కార్యాలయం నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వేరే కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు..

