
ఆంజనేయులు న్యూస్: పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తులకు అయిదేళ్ల వరకు 24 గంటల వ్యక్తిగత భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ భద్రత పదవీ విరమణ చేసిన నాటి నుంచి అయిదేళ్లపాటు సదరు ప్రధాన న్యాయమూర్తి నివాసంతోపాటు, వ్యక్తిగతంగానూ సాగుతుందని కేంద్ర న్యాయశాఖ శుక్రవారం తెలిపింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇలాంటి భద్రత మూడేళ్లపాటు కొనసాగుతుందని పేర్కొంది. ఒకవేళ విభిన్న హెచ్చరికల రీత్యా రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులకు ఉన్నతస్థాయి భద్రతను కల్పించి ఉంటే అదే భద్రత కొనసాగుతుందని తెలిపింది. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు జీవితకాలంపాటు ఇంటిపని సహాయకులు, డ్రైవర్, సచివాలయ ఉద్యోగిని అందించనున్నట్లు పేర్కొంది. పదవీ విరమణ చేసిన జడ్జీకి అయితే సచివాలయ సహాయకుడిని మినహాయించి మిగిలిన ఇద్దర్నీ జీవితకాలం కొనసాగించనున్నట్లు తెలిపింది.


