అర్హత లేని సిబ్బంది వల్ల రోగుల్లో గందరగోళం
ట్రాఫిక్ సమస్యలపై ఆగ్రహం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో ఉన్న మహేశ్వరి మెడికల్పై స్థానిక ప్రజలు, రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేని సిబ్బంది ద్వారా మందులు అందించడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు ఇవ్వాల్సిన చోట, సిబ్బంది తమ స్వంత విధానంలో వివరాలు చెప్పడం వల్ల రోగులు గందరగోళానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల రోగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా, ఈ మెడికల్ షాప్ వద్ద ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి. మెడికల్కు వచ్చే వాహనదారులు రోడ్డుపైనే వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సమస్యలపై ట్రాఫిక్ అధికారులు మాత్రమే కాకుండా జిల్లా వైద్యశాఖ అధికారులు కూడా వెంటనే స్పందించి, పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అర్హత లేని సిబ్బందిని తొలగించడం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

