పోలీసుల ఉత్సాహభరిత వేడుకలు – ప్రశాంతంగా పండుగ నిర్వహణపై డీసీపీ భాస్కర్ సంతృప్తి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం బుధవారం రంగులతో కళకళలాడింది. హోలీ పండుగ సందర్భంగా పోలీసులు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఏసీపీ ప్రకాశ్, సీఐలు, పోలీసు సిబ్బంది పరస్పరం రంగులు చల్లుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ.. హోలీ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని తెలిపారు. భేషజాలు, విభేదాలు పక్కనబెట్టి అందరినీ ఒక్కటిగా చేసే సామరస్య పండుగగా హోలీ నిలుస్తుందన్నారు. ప్రజలు ఆనందంతో పాటు బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ప్రశాంతంగా సాగేందుకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపట్టామని వెల్లడించారు. పోలీసుల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్నేహభావాన్ని పంచుకున్నారు.

