వ్యక్తిగత పరిశుభ్రత, కీటక జనిత వ్యాధులపై విద్యార్థులకు అవగాహన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి కుంటలో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, బీసీ హాస్టల్ మరియు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను అధికారులు సందర్శించి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం, పరిశుభ్రమైన నీటిని సేవించడం, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై వివరించారు. అదేవిధంగా దోమలు కుట్టడం ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి కీటక జనిత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దోమలు పుట్టకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వెంటనే ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల మేనేజ్మెంట్ సిబ్బంది, విద్యార్థులకు జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిసిడిఓ లావణ్య, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

