
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆగ్రహ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన వెంకటరమణారెడ్డి పై అక్కస్సుతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు గుండాలను ప్రేరేపించి దాడులు చేయిస్తున్నారని తీవ్రంగా ఖండించారు.
“ఈ రోజు అధికారం శాశ్వతమని భావించి బీజేపీ నాయకులపై దాడులకు దిగుతున్నారు. శాసనసభ సభ్యుడికే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో ప్రజలు ఆలోచించాలి” అని నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ప్రజల భద్రతను ఎలా కాపాడగలదని ప్రశ్నించారు.
బీజేపీ కార్యకర్తలు బెదిరింపులకు భయపడరని, ప్రతి కార్యకర్త వందమంది సైనికులతో సమానమని హెచ్చరించారు. భవిష్యత్తులో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగితే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ జోన్ల నాయకులు, జిల్లా మరియు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
