
ఆంజనేయులు న్యూస్, ఛత్తీస్ గఢ్ : రాత్రికి రాత్రే.. 10 టన్నుల స్టీల్ వంతెన చోరీకి గురైన ఘటన (Steel bridge stolen overnight) ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్బా నగరంలో నాలుగు దశాబ్దాల క్రితం ధోధిపారా ప్రాంతంలోని హర్డియో ఎడమకాలువపై 70 అడుగుల పొడవైన ఉక్కు వంతెనను నిర్మించారు. ఈ వంతెన బరువు 10 టన్నులకు పైనే ఉంటుంది. జనవరి 18న ఉదయం నిద్ర లేచిన స్థానికులకు కాలువపై స్టీల్ వంతెన (Steel bridge) కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ముందురోజు రాత్రి వరకు ఉన్న వంతెన తెల్లవారేసరి మాయమైపోవడంతో ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనవరి 17న రాత్రి సమయంలో గుర్తుతెలియని 15 మంది దుండగులు గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వంతెన రెయిలింగ్లను కట్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. రెయిలింగ్లను నిందితులు స్క్రాప్ విక్రయించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
